10 new judges appointed to Telangana High Court
తెలంగాణ హైకోర్టుకు కొత్తగా పది మంది న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం న్యాయవాదుల కేటగిరీ నుంచి ఏడుగురు, న్యాయాధికారుల కేటగిరీ నుంచి అయిదుగురు కలిపి మొత్తం 12 మంది పేర్లు సిఫార్సు చేయగా, వారిలో 10 మంది నియామకాలకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. వీరిలో న్యాయవాదుల విభాగం నుంచి కాసోజు సురేందర్, సూరేపల్లి నంద, ముమ్మినేని సుధీర్కుమార్, జువ్వాడి శ్రీదేవి, ఎన్.శ్రావణ్ కుమార్ వెంకట్ ఉన్నారు. న్యాయాధికారుల విభాగం నుంచి గున్ను అనుపమా చక్రవర్తి, మాటూరి గిరిజా ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఏనుగు సంతోష్రెడ్డి, దేవరాజ్ నాగార్జున్లను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తున్నట్లు కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 217(1)కింద దఖలుపడిన అధికారాలను అనుసరించి రాష్ట్రపతి వీరి నియామకాలకు ఆమోదముద్ర వేసినట్లు పేర్కొంది. ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్న క్రమంలో వారి సీనియారిటీ వర్తిస్తుందని, బాధ్యతలు చేపట్టిన నాటినుంచి వారి నియామకం అమల్లోకి వస్తుందని తెలిపింది. మొత్తం 42 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన హైకోర్టులో ప్రస్తుతం 19 మంది సేవలందిస్తున్నారు. వీరి నియామకంతో మొత్తం సంఖ్య 29కి చేరుతుంది. హైకోర్టులో ఒకేసారి పది మంది న్యాయమూర్తులను నియమించడం ఇదే మొదటిసారి.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************