AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్
Current affairs play a very important role in the competitive examinations and hence, aspirants have to give undivided attention to it while doing preparation for the government examinations. The banking or state govt examinations comprise a section of “General Awareness” to evaluate how much the aspirant is aware of the daily happenings taking place around the world. To complement your preparation, we are providing you with a compilation of the Current affairs of August 1st week.
AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్
Weekly current Affairs PDF in Telugu : APPSC, TSPSC గ్రూప్స్ , SI మరియు కానిస్టేబుల్ పరీక్షలలో జనరల్ అవేర్నెస్ చాలా ముఖ్యమైన విభాగాలలో ఒకటి మరియు మీరు మీ సమయాన్ని హృదయపూర్వకంగా కేటాయించినట్లయితే ఈ అంశం నుండి చాలా మంచి మార్కులు సాధించగలరు. పరీక్షల ముందు అప్పటికప్పుడు ఈ అంశాన్ని చదువుకొని వెళ్ళడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించడం అసాధ్యం. GA మీరు 10-15 రోజుల్లో పూర్తి చేయగల విభాగం కాదు. మీరు జనరల్ అవేర్నెస్ పై పట్టు సాధించడానికి ఉత్తమ మార్గం రోజూ వార్తాపత్రికలను చదవడం లేదా వారపు వార్తల ద్వారా వెళ్ళడం.
దీని ద్వారా నెలవారీ లేదా 6 నెలల వార్తల ద్వారా తెలుసుకొనే సమాచారం కంటే ఎక్కువ సమాచారం తెలుసుకోవచ్చు. ఇక్కడ మేము మీకు అన్ని వార్తాపత్రికల నుండి సమకాలీన అంశాల సారాంశాన్ని అందిస్తున్నాము, ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు మీరు ఆ సమయాన్ని వారాంతపు సమకాలీన అంశాలు 2022 అధ్యయనం కోసం కేటాయించవచ్చు.
APPSC/TSPSC Sure shot Selection Group
Telangana State Weekly Current affairs
1. ఒకే చోట నుంచి రాష్ట్రమంతా వీక్షణ.. పోలీస్ టవర్స్ ప్రత్యేకలివే
రాష్ట్రానికే తలమానికంగా దేశానికే ఆదర్శంగా నగరంలో ఏర్పాటైన తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీఎస్ఐసీసీసీ) ఆధునిక సాంకేతికతకు కేరాఫ్ అడ్రస్గా మారనుంది. అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ దీన్ని నిర్మించారు. ఈ నేపథ్యంలోనే వీటి కోసం నగర పోలీసు విభాగానికి చెందిన 25 మంది అధికారులను నియమించారు. ఆద్యంతం పర్యవేక్షించే బాధ్యతల్ని అదనపు సీపీ (శాంతిభద్రతలు) డీఎస్ చౌహాన్కు అప్పగించారు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు పదవీ విరమణ చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఆహ్వానిస్తున్నారు.
నగర కమిషనరేట్ పరిధిలోని శాంతిభద్రతలు, సీసీఎస్, టాస్క్ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్.. ఇలా అన్ని విభాగాలనూ ఒకే గొడుకు కిందికి తీసుకువస్తున్నారు. వీటిలో ఏ విభాగానికి సంబంధించిన పని కోసమైనా ప్రజలు వివిధ చోట్లకు తిరగాల్సిన అవసరం లేకుండా సింగిల్ విండో విధానం అమలుకానుంది.
2. ఆసియాలోనే పెద్ద మార్కెట్
ఆసియాలోనే అత్యంత పెద్దదిగా కోహెడ మార్కెట్ నిర్మాణం చేపడుతున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. అందుకోసం రూ. 400 కోట్లకు పైగా ఖర్చు చేస్తామని ఆయన తెలిపారు. ఈ మేరకు మంత్రుల నివాస సముదాయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 178 ఎకరాల్లో కోహెడ మార్కెట్ను నిర్మించాలని నిర్ణయించామన్నారు. 41.57 ఎకరాల్లో షెడ్ల నిర్మాణం, 39.70 ఎకరాల్లో 681 కమీషన్ ఏజెంట్ల దుకాణాలు, 19.71 ఎకరాల్లో కోల్డ్ స్టోరేజీల నిర్మాణం, 45 ఎకరాల్లో రహదారుల నిర్మాణం, 24.44 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు. మాస్టర్ లే ఔట్, ఇంజనీరింగ్ డిజైన్స్ ఎస్టిమేట్లకు వయాంట్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (గుర్గావ్)కు టెండర్ అప్పగించామన్నారు.
3. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ నగర సిగలో మరో కలికితురాయి వచ్చి చేరింది. ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇప్పటికే తన ఛాంబర్లో సీపీ సీవీ ఆనంద్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ను(సీసీసీ) సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మరోవైపు సీసీసీ వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి.
18వ ఫ్లోర్లో సీపీ ఆఫీస్
అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ, ఒకేచోటా నుంచి నగరమంతా వీక్షించేలా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను నిర్మించారు. దేశంలోని అన్ని శాఖలను ఇంటిగ్రేట్ చేస్తూ రూ. 600 కోట్లతో 18 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు. 7 ఎకరాలు, 6.42 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరిగింది. భవనం ఎత్తు 83.5 మీటర్లు. టవర్ ఏ లోని 18వ ఫ్లోర్లో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఉంది. 14, 15వ ఫ్లోర్లో మ్యూజియం, గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఏడో అంతస్తులో ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా కీలక విభాగాల అధిపతులకు ఛాంబర్లు ఉంటాయి. టవర్ బి మొత్తాన్ని టెక్నాలజీ వింగ్కు కేటాయించారు.
4. రామగుండంలో అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్
దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్(నీటిపై తేలియాడే) సోలార్ ప్లాంట్ను ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. 100 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని 500 ఎకరాల్లో రూ.423 కోట్లతో ఈ ప్లాంట్ను నెలకొల్పారు. అనంతరం జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ సందర్భంగా అధికారులు రామగుండం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లోని కాకతీయ ఫంక్షన్హాల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
పెద్ద డిజిటల్ డిస్ప్లే ఏర్పాటు చేశారు. ప్రధాని ప్రారంభించిన అనంతరం ఎన్టీపీసీ సీజీఎం సునీల్ మాట్లాడుతూ ఈ ప్లాంట్ను దశలవారీగా విస్తరించనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా ఎన్టీపీసీ ఆవరణలో నిర్మిస్తున్న తెలంగాణ సూపర్ థర్మల్ ప్రాజెక్టు స్టేజీ–1లో రెండు యూనిట్ల పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. సెప్టెంబర్ రెండోవారంలో ట్రయల్కు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.
5. వైల్డ్లైఫ్ ఎవిడెన్స్ కలెక్షన్ కిట్ ఆవిష్కరణ
వన్యప్రాణుల సంరక్షణ, వాటి డేటాను భద్రపర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా అరణ్యభవన్లో ‘వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ’రూపొందించిన వైల్డ్లైఫ్ ఎవిడెన్స్ కలెక్షన్ కిట్ను మంత్రి ఆవిష్కరించారు. కిట్ పని తీరు, శాంపిల్స్ సేకరణ, వైల్డ్లైఫ్ డీఎన్ఏ పరీక్షల విశ్లేషణ తదితర అంశాలను సొసైటీ ప్రతినిధులు వివరించారు.
వన్యప్రాణుల వధ జరిగినపుడు నేర పరిశోధనలో భాగంగా ఆ ప్రాంతం నుంచి ఆధారాలను సేకరించడం, అవి సహజ మరణం పొందినప్పుడు వాటి పాదముద్రలు, గోళ్లు, వెంట్రుకలు, పెంట, మాంసాహార అవశేషాలను సేకరించి వాటి డీఎన్ఏ పరీక్షల విశ్లేషణ కోసం పంపుతామన్నారు. విచారణ సమయంలో న్యాయస్థానాలకు ఈ పరీక్షల రిపోర్టును సమర్పిస్తే, వాటి ఆధారంగా వేటగాళ్ళకు శిక్ష పడే అవకాశం ఉంటుందని చెప్పారు.
Andhra Pradesh state Weekly Current affairs
1. మిస్ సౌత్ ఇండియాగా వైజాగ్ అమ్మాయి చరిష్మా కృష్ణ
మిస్ సౌత్ ఇండియాగా విశాఖ అమ్మాయి, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫైన్ ఆర్ట్స్ విభాగం విద్యార్థిని చరిష్మా కృష్ణ ఎంపికైంది. కేరళలో పెగాసస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన ఈ పోటీల్లో ఆమె కిరీటం దక్కించుకుంది. ఈ పోటీల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన యువతులు పాల్గొన్నారు. వీరందరినీ వెనక్కి నెట్టి, తన ప్రతిభతో చరిష్మా విజేతగా నిలిచింది.
ప్రముఖ మోడల్ భారతి బెర్రి ఆమెకు శిక్షణ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫెమీనా మిస్ ఇండియాకు సిద్ధమవుతోంది. చిన్నతనం అమెరికాలో గడిపిన చరిష్మా కృష్ణ భరతనాట్యం, కూచిపూడి నృత్యం తొమ్మిదేళ్లుగా నేర్చుకుంటోంది. స్విమ్మింగ్, కరాటే, గుర్రపుస్వారీ విద్యలను సైతం నేర్చుకుంది. చిన్నతనం నుంచి కళలపై ఆసక్తితో నృత్య కళాకారిణిగా, నటిగా రాణిస్తోంది. తండ్రి హరికృష్ణ ప్రభుత్వ ఉద్యోగి కాగా తల్లి గృహిణి.
2. ఆంధ్రప్రదేశ్లో 12 ఫాస్ట్ట్రాక్ కోర్టులు
అత్యాచారం కేసులు, చిన్నారులపై జరిగే లైంగిక అత్యాచారం (పోక్సో) కేసులను త్వరితగతిన పరిష్కరించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లో 12 ఫాస్ట్ట్రాక్ స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ అత్యాచారం, పోక్సో కేసుల పరిష్కారం కోసం దేశంలో 1,023 ఫాస్ట్ట్రాక్ స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయాలని 2019 అక్టోబర్లో నిర్ణయించినట్లు తెలిపారు.
ప్రస్తుతం దేశంలో 728 ఫాస్ట్ట్రాక్ ప్రత్యేక కోర్టులు పని చేస్తున్నట్లు చెప్పారు. ఫాస్ట్ట్రాక్ స్పెషల్ కోర్టుల కాలపరిమితిని ఒక ఏడాదికి పరిమితం చేయాలని ముందుగా నిర్దేశించినా తదుపరి 2023 మార్చి 31 వరకు వీటిని కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ఏడాది జూన్ నాటికి దేశంలోని అన్ని ఫాస్ట్ట్రాక్ ప్రత్యేక కోర్టుల్లో కలిపి లక్షకుపైగా కేసులను పరిష్కరించినట్లు తెలిపారు.
3. AP: హైకోర్టు నూతన జడ్జిలుగా ఏడుగురు ప్రమాణస్వీకారం
ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన ఏడుగురు న్యాయాధికారులు ప్రమాణం చేశారు. ఏవీ రవీంద్రబాబు, డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ సాగర్, బండారు శ్యాం సుందర్, ఊటుకూరు శ్రీనివాస్, బొప్పన వెంకట లక్ష్మీ నరసింహ చక్రవర్తి, తాళ్లప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణలతో గవర్నర్ హరిచందన్ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణం చేయించారు. వాస్తవానికి ప్రమాణ స్వీకారం చేయించే విషయంలో గవర్నర్ తన అధికారాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బదలాయిస్తారు. దీంతో కొత్త న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి (సీజే) ప్రమాణం చేయించడం ఆనవాయితీ. సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు మాతృవియోగం కలగడంతో ఆయన వచ్చే పరిస్థితి లేదు. దీంతో గవర్నర్ కొత్త న్యాయమూర్తులతో ప్రమాణం చేయించారు.
4. ఓఎన్జీసీకి ఎన్జీటీ భారీ జరిమానా
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ లిమిటెడ్(ఓఎన్జీసీ)కి భారీ జరిమానా విధించింది జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ). కోనసీమ జిల్లాలో జల, భూ కాలుష్యానికి కారణమైనందున రూ.22.76 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది. ఓఎన్జీసీపై చర్యలకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆదేశించింది. సీఎస్ఆర్ ఫండ్స్ను ప్రాజెక్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఖర్చు చేయాలని స్పష్టం చేసింది. సంయుక్త కమిటీ నివేదిక ఆధారంగా ఓఎన్జీసీకి భారీ జరిమానా విధించినట్లు తెలిపింది. యెనుమల వెంకటపతి రాజు పిటిషన్పై విచారణ చేపట్టిన హరిత ట్రైబ్యునల్- (ఎన్జీటీ) తీర్పు వెలువరించింది. పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలపై ఈ జరిమానా విధించింది.
5. అగ్రి ఇన్ఫ్రా ఫండ్ వినియోగంలో ఏపీ నంబర్ 1
వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధుల (అగ్రి ఇన్ఫ్రా ఫండ్) వినియోగంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. వ్యవసాయ క్షేత్రం (ఫామ్ గేట్) వద్ద మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తూ ఉత్తమ రాష్ట్రంగా ఆవిర్భవించింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో అగ్రి ఫండ్స్ వినియోగంలో దేశంలోనే ఉత్తమ రాష్ట్రం అవార్డును కేంద్ర వ్యవసాయ, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ న్యూ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రైతుబజార్ల సీఈవో బి.శ్రీనివాసరావుకు అందజేశారు. అగ్రి ఇన్ఫ్రా ఫండ్స్ వినియోగంలో అనేక రాష్ట్రాలు చాలా వెనుకబడి ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈ నిధులను వినియోగించుకొని గ్రామస్థాయిలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అగ్ర స్థానంలో నిలిచిందని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రశంసించారు.
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ క్షేత్రం వద్ద బహుళ ప్రాయోజిత కేంద్రాల ద్వారా పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. పీఎసీఎస్ ద్వారా ఆర్బీకే స్థాయిలో 4,277 గోదాములు – డ్రయింగ్ ప్లాట్ఫారాలు, ఏపీ సీవిల్ సప్లైస్ కార్పొరేషన్ కోసం 60 బఫర్ గోడౌన్లు, ప్రైమరీ ప్రాసెసింగ్ కోసం 830 క్లీనర్స్, 4,277 డ్రయింగ్ ప్లాట్ఫారాలు, 2,977 డ్రయర్లు, 101 పసుపు పాలిషర్స్ ఏర్పాటు చేసింది. ఉద్యాన ఉత్పత్తుల కోసం 945 కలెక్షన్ సెంటర్లు, 344 కూల్డ్ రూమ్స్, ఆర్బీకేలకు అనుబంధంగా 10,678 ఎస్సైయింగ్ పరికరాలు, 10,678 ప్రొక్యూర్మెంట్ కేంద్రాలు వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. ఇలా 39,403 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు రూ.2,706 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసింది. తొలి విడతగా 1,305 పీఏసీఎస్ల పరిధిలో 10,677 మౌలిక సదుపాయాల కల్పనకు అగ్రి ఇన్ఫ్రా ఫండ్ కింద రూ.1,584.6 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులు చురుగ్గా జరుగుతున్నాయి.
6. ఇంగ్లిష్ జల సంధిని ఈదిన హెడ్ కానిస్టేబుల్ తులసీచైతన్య
స్విమ్మింగ్ మౌంట్ ఎవరెస్ట్గా ప్రసిద్ధికెక్కిక ప్రఖ్యాత ఇంగ్లిష్ జలసంధిని అంతర్జాతీయ స్విమ్మర్ తులసీచైతన్య సునాయాసంగా ఈదాడు. ఇంగ్లండ్లోని డోవర్ తీరం నుంచి ఫ్రాన్స్లోని కలైస్ తీరం వరకూ ఈ జలసంధి ఉంది. అక్కడి ఆర్గనైజర్లకు రూ.4 లక్షలు చెల్లించి ఆయా దేశాల అనుమతులు తీసుకుని ఈ నెల 27న 33.79 కిలోమీటర్ల పొడవున్న జలసంధిని 15 గంటల 18 నిమిషాల్లో ఈదాడు.
స్విమ్మర్ తులసీచైతన్య విజయవాడ పోలీస్ కమిషనరేట్లో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. గతంలో పాక్ జలసంధి(భారత్–శ్రీలంక), జీబ్రా జలసంధి(తరిఫా–మెహారో), బోడెన్సీ జలసంధి(జర్మనీ–స్విట్జర్లాండ్)లను ఈదిన రికార్డులున్నాయి. ఇంగ్లండ్ తీరంలో ఉన్న మరో రెండు జల సంధులను ఈదేందుకు తులసీచైతన్య సిద్ధమవుతున్నాడు. మైనస్ డిగ్రీల చలి, షార్క్లు, జెల్లీ ఫిష్లు కలిగిన ఇంగ్లిష్ జలసంధిని సాహసోపేతంగా ఈదిన తులసీచైతన్యను కృష్ణా జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి రమేష్ అభినందించారు.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |